'హిందువులంతా బీజేపీకి ఓటు వేయాలి' అన్న రాజస్థాన్ మంత్రిపై కేసు నమోదు

  • ముస్లింలంతా కాంగ్రెస్ కు ఓటు వేసుకోవచ్చన్న కటారియా
  • మత ప్రాతిపదికన ఓట్లు అడిగినందుకు కేసు నమోదు
  • తప్పు సరిదిద్దుకునే పనిలో పడ్డ బీజేపీ
రాజస్థాన్ మంత్రి ధన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరికొత్త వివాదానికి నాంది పలికాయి. హిందువులంతా బీజేపీకే ఓటు వేయాలన్న ఆయన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హిందువుల ఓట్లను ఆకర్షించేందుకు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. మరోవైపు, మతం ఆధారంగా ఓట్లను అడగడం ద్వారా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ను ఉల్లంఘించారంటూ ఆయనపై కేసు నమోదైంది. ఈ నెల 26న ఓ సభలో ఆయన ప్రసంగిస్తూ, 'రాజస్థాన్ లో ఉన్న హిందువులంతా బీజేపీకే ఓటు వేయాలి. ముస్లింలంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ కు ఓటు వేసుకోవచ్చు' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో, జరిగిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం బీజేపీ చేసింది. రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా మాట్లాడుతూ, మత ప్రాతిపదికన బీజేపీ ఓట్లు అడగదని అన్నారు. ఓటరుకు మతం ఉండదని... రాష్ట్ర, దేశ అభివృద్ధికి ఎవరు కృషి చేస్తారో వారికే ఓటు వేస్తారని చెప్పారు. డిసెంబర్ 7న రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 
Go Back to Shorts
kataria
Rajasthan
bjp
hindu
muslim
voters

More Telugu News